అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
📖"వికసిత బాల్యానికి జిజ్ఞాస"
నేడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం......📖
మంచి పుస్తకం ఓ మంచి ప్రాణ స్నేహితుడితో సమానం, వజ్రాల కన్నా పుస్తకాల విలువే ఎక్కువని బాపూజీ అంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అమూల్యమైన ఆస్తి మంచి పుస్తకాలే. చదువు మెదడుకు పదును పెడుతుంది. పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కథల పుస్తకాలు పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్న చదవడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. పిల్లల్లో పఠనాసక్తిని కలిగించడం, పిల్లలతోపాటు పెద్దల్ని కూడా బాలసాహిత్యం వైపు ఆకర్షించడం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవ ముఖ్య ఉద్దేశం. 1967 నుంచి ఏటా ఏప్రిల్ 2న అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు.
ఎలెక్ట్రానిక్ మీడియా, వీడియో గేంస్ ఎంతో ప్రబావం చూపుతున్న ఈ కాలం లో కూడా పిల్లలకి కధల పుస్తకాలంటే ప్రాణం. మీడియా ప్రభావం వలన మిగిలిన సాహిత్యం కాస్త కుంటుపడిందని అనక తప్పదు. నిజానికి ఇటువంటి పరిస్థితులలో బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాస సాహిత్యం మాత్రమే ప్రపంచం లో నిలదొక్కుకోగలిగిందని చెప్పవచ్చు. ఇదంతా వేరే విషయం.
ఇంతకీ ఈ బాలల పుస్తకదినోత్సవం ఎలా మొదలయింది. దీనికో చిన్న కధ ఉంది.
ఫెయిరీ టేల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అయితే ఈ ఫెయిరీ టేల్స్ సృష్టికర్త " హాన్ స్ క్రిష్టియన్ ఆండర్సన్ " డెన్మార్క్ లో పుట్టిన ఈయన 1805-1875 మధ్య నివశించాడు. ఈయన రాసిన అనేక కధలలో .. ద లిటిల్ మెర్మైడ్, ద స్నో క్వీన్, ద ప్రిన్సెస్ అండ్ ద పీ మరియు థంబులీన్
చాలా ప్రాచుర్యం పొందాయి. అంతేకాదు ఈయన రాసిన జానపద కధలు 150 భాషల్లోకి అనువదింపబడ్డాయి. అంతేనా..ఎన్నో ఏనిమేషన్ చిత్రాలు, పిల్లల నాటికలకు, సినిమాలకు ప్రేరణని ఇచ్చాయి. మరి ఈ రోజెందుకు బాలల పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఆండర్సన్ ( ఏప్రిల్ 2 ) గారి పుట్టిన రోజు కాబట్టి.
తెలుగులో తొలిసారిగా జనవినోదిని పత్రిక (1875-85) బాలల కోసం ప్రత్యేక రచనలను ప్రారంభించింది. 1947లో నాగిరెడ్డి- చందమామను ప్రారంభించారు. బాలసాహిత్యానికి చందమామ చేసిన సేవ వెలకట్టలేనిది. చందమామ తరువాత బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి వంటి పత్రికలు పిల్లలను అలరించాయి. తెలుగు రచయితల్లో చాలామంది సుప్రసిద్ధులు బాలసాహిత్యానికి ఎనలేని సేవలందించారు. న్యాయపతి రాఘవరావు, ఏడిద కామేశ్వరరావు, తురగా జానకిరాణి, రావూరి భరద్వాజ, ఇల్లిందల సరస్వతీదేవి వంటి వారు బాలల కోసం ప్రత్యేకమైన రచనలు విరివిగా చేశారు.
పుస్తకాలు చదవడంతో సమాజంపై అవగాహన పెరుగుతుంది. మొదట పిల్లలకు చిన్న చిన్న కథలు వినిపిస్తుండాలి. చిత్రాలతో కూడిన ఆసక్తికర పుస్తకాలను చదివించాలి. దాంతో వారు తెలియకుండానే పుస్తకాల పట్ల ఆకర్షితులవుతారు. చిన్నారుల ఇష్టానికి తగినట్లుగా పుస్తకాలు ఎంపిక చేసి చదివేలా ప్రోత్సహించాలి. సాహిత్య అకాడమీలు, సాక్షర భారత్, సర్వశిక్ష అభియాన్ వంటివి కూడా పిల్లలకు, విద్యార్థులకు అవసరమైన అనేక పుస్తకాలు ప్రచురించాయి.
పుస్తకరూపం మారవచ్చు కాని, పుస్తకానికి ఆదరణ మాత్రం తగ్గలేదు. తరతరాలుగా జ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తున్నది పుస్తకం. పుస్తకం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం చిన్నారులు పుస్తకాలను పట్టుకొని చదువడం మరిచి సామాజిక మాధ్యమాలకు అంకితమవుతున్నారు. ఇంటర్నెట్లో చదివే పిల్లల్లో సహజ ఎదుగుదల మందగిస్తుంది. పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా స్వీకరించి పిల్లలతో చిన్నప్పటి నుండే చదివించాలి. పుస్తకాలపై పిల్లలకు అభిరుచిని పెంచుదాం. వారి మానసిక వికాసానికి తోడ్పడుదాం.
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అనే సూక్తిని వినే ఉంటారు. మంచి పుస్తకం దగ్గరుంటే స్నేహితుడు తోడున్నట్టే అంటారు పెద్దలు.
#ప్రపంచంలోనే బాల సాహిత్యం మొదట పుట్టింది మన దేశంలోనే. క్రీస్తు పూర్వం 200లలో విష్ణుశర్మ రచించిన 'పంచతంత్రం' కథలు జంతువుల పాత్రలతో ఇప్పటికీ ఆకట్టుకుంటాయి.#
#We Love Reading#
అక్షరాస్యత నైపుణ్యాలను ప్రోత్సహించడానికి "వుయ్ లవ్ రీడింగ్" (చదవదం మాకిష్టం) అనే ప్రత్యేక ప్రచారాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మిషన్ మోడ్ ప్రచారంలో పిల్లలందరికీ పాఠశాల, ఇల్లు మరియు గ్రామంలో ఆనందకరమైన వాతావరణంలో చదవడానికి వివిధ మార్గాలు అందించబడతాయి.
పాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత, రిటైర్డ్ వ్యక్తులు, విద్యావేత్తలు, ఎన్జీఓఎస్ తదితరులు ఈ ప్రచారాన్ని నిర్వహించడానికి ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది.
🙏📖🌷🌺🌹📖🙏
Collected by
RV RAMANA DSO CHITTOOR
Comments
Post a Comment